Thursday, September 26, 2024
HomeUncategorizedసందేశ్‌ఖాలీ బాధితురాలు ఎంపీగా పోటీ

సందేశ్‌ఖాలీ బాధితురాలు ఎంపీగా పోటీ

Date:

బిజెపి ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ స్థానం నుంచి రేఖా పత్రాను నిలబెట్టింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే సందేశ్‌ఖాలీ గ్రామం ఉంది. షాజహాన్‌ షేక్‌ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖ.. కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అతడి అనుచరుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

ఆందోళనల సమయంలో బిజెపి నేత సువేందు అధికారి.. రేఖ ఇంటికి వెళ్లి అండగా నిలిచారు. ఇటీవల ప్రధాని మోడీ బరసత్‌ పర్యటనకు వచ్చిన సమయంలో రేఖతో పాటు సందేశ్‌ఖాలీ మహిళలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కమలం పార్టీ ఆమెకు టికెట్‌ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బసిర్‌హట్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ నేత, నటి నుష్రత్‌ జహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆమెను పక్కనబెట్టి హజీ నురుల్‌ ఇస్లామ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలుండగా.. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా టీఎంసీ, భాజపా మధ్యే పోరు నెలకొంది. విపక్ష ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఇటీవల తృణమూల్‌ ప్రకటించింది. మొత్తం స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.