Monday, September 23, 2024
HomeUncategorizedలోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ ఓటమి ఖాయం

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ ఓటమి ఖాయం

Date:

దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందన్న వల్లే టీఎంసీ తనపై ఆగ్రహంగా ఉందని, అధికారం నుంచి వారికి వీడ్కోలు పలికేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ ఓటమి ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్‌ హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసును ప్రస్తావించారు. ఈసందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ సోదరీమణులపై టీఎంసీ నేత పాల్పడిన అఘాయిత్యాలను చూసి యావత్ దేశం ఆగ్రహించింది. ఈ ఘటన సిగ్గుచేటు. ఇలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజారామ్మోహన్‌రాయ్‌ ఆత్మ ఘోషించి ఉంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ నేత (షేక్‌ షాజహాన్‌) అన్ని హద్దులూ దాటాడు. అయినా, రెండు నెలల పాటు అరెస్టు చేయలేదు. అతడిని కేసు నుంచి కాపాడేందుకు తృణమూల్‌ తీవ్రంగా ప్రయత్నించింది అని మోడీ దుయ్యబట్టారు.

ఈసందర్భంగా విపక్షాల ‘ఇండియా కూటమి’పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. ”సందేశ్‌ఖాలీ దారుణాలపై ప్రతిపక్షాల కూటమి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. అవినీతిపరులకు అండగా ఉండటం, బుజ్జగింపు రాజకీయాలే వారికి ప్రథమ ప్రాధాన్యం” అని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేయకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మండిపడ్డారు. వారి రాజకీయాల కారణంగా పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు.