మార్చి మొదటివారంలోనే ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది వేసవి కాలం భానుడి మంటలతోనే మొదలైనట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీయవచ్చని తెలిపింది.
మార్చి-మే మధ్యకాలంలో దేశంలో అనేకచోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ఉత్తర, మధ్య భారత్లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావం వేసవివరకూ ఉండే అవకాశం ఉందని..ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు.
మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలాఉంటే, ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.