Monday, September 30, 2024
HomeUncategorizedప్రాణ స్నేహితుడిని హత్య చేయించిన క్వార్టర్ బాటిల్

ప్రాణ స్నేహితుడిని హత్య చేయించిన క్వార్టర్ బాటిల్

Date:

మద్యపానం ఎంత ప్రమాదకరమో, అది ఎంత హాని చేస్తుందో తెలియజేసే ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహంగా ఉండే ఇద్దరు స్నేహితులను ఒక్క క్వార్టర్ బాటిల్ వేరుచేసింది. అప్పటి దాకా వారి మధ్యన ఉన్న స్నేహాన్ని మరిచిపోయేలా చేసింది. స్నేహితుల మధ్య గొడవకు కారణమై.. చివరకు ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం జరగ్గా.. పోలీసులు కేసును చేధించారు. హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టారు.

పోలీసులు వివరాల ప్రకారం.. యర్రగొండపాలెనికి చెందిన వెలగల శ్రీనివాసులు, ఓరుగంటి రాజేష్ అనే ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కూడా మద్యానికి బానిసలుగా మారిపోయారు. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఉదయం శ్రీనివాసులు.. మద్యం తాగేందుకు రెండు క్వార్టర్ బాటిళ్లు తెచ్చుకున్నాడు. ఇది గమనించిన రాజేష్.. అందులో ఒకటి తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అందుకు శ్రీనివాసులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తగా.. ఆవేశంలో శ్రీనివాసులు రాజేష్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు స్నేహితులు విడిపోయారు.

శ్రీనివాసులు తనపై చేయి చేసుకున్న విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజేష్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అదే రోజు రాత్రి ఒకటిన్నర సమయంలో శ్రీనివాసులు నిద్రపోయే చోటుకు చేరుకున్నాడు. శ్రీనివాసులు నిద్రపోతున్న సంగతిని గమనించి.. తనవెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో శ్రీనివాసులుపై దాడిచేశాడు. అనంతరం చనిపోయాడని నిర్ధారించుకుని ఇనుపరాడ్ అక్కడే పడేసి.. ఘటనాస్థలం నుంచి ఉడాయించాడు. ఉదయాన్ని శ్రీనివాసులు హత్య విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణలో స్నేహితుడే హత్య చేశాడని తెలిసి అరెస్ట్ చేశారు.