Tuesday, September 24, 2024
HomeUncategorizedప్రతి మహిళకు నెలకు రూ.1,000 అందజేత

ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అందజేత

Date:

దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. మహిళ ఓటుబ్యాంక్‌పై దృష్టి సారించిన ఆ పార్టీ- వరాల జల్లును కురిపించింది. మహిళలను ఆర్థికంగా చేయూత అందించడానికి ఉద్దేశించిన పథకాన్ని ప్రకటించింది.రముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే ప్రతి మహిళకు, ప్రతి నెలా 1,000 రూపాయల నగదు మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఈ పథకాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.

సోమవారం ఆమె అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం వరుసగా పదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని, దీనికి గుర్తుగా తమ రాష్ట్రం పరిధిలోని నివసించే ప్రతి మహిళకూ, ప్రతి నెలా 1,000 రూపాయలను మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకాన్నిఅమలు చేయడానికి 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల మొత్తం అవసరమౌతుందని అంచనా వేశామని ఆతిషి చెప్పారు. ఈ మేరకు ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి మహిళనూ ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రూపొందించామని అన్నారు.