Wednesday, October 2, 2024
HomeUncategorizedపెళ్లి కాని పురుషులకు పెన్షన్ ఇవ్వాలి

పెళ్లి కాని పురుషులకు పెన్షన్ ఇవ్వాలి

Date:

ఎన్నికల వేళ హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం కీలక డిమాండ్లు చేస్తోంది. రాష్ట్రంలో పెళ్లి కాని వారికి, పెళ్లి అయి భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి కాని వారు, భార్యను పోగొట్టుకున్న వారు ఎంత మంది ఉన్నారు అనేది లెక్కించాలని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందించాలని కోరుతున్నారు. ఇదేదో హామీ ఇస్తే సరిపోదని.. దానిని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం తేల్చి చెప్పింది. గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ పథకం సరిగ్గా అమలు జరగడం లేదంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

హర్యానాలోని 40 ఏళ్లు దాటిన పెళ్లి కానివారు, భార్య లేని వారు కలిసి.. 2022 లో సమస్త అవివాహిత పురుష సమాజం పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సంఘంలో ఒక్క హర్యానాలోనే 7 లక్షల మంది సభ్యులుగా ఉండటం గమనార్హం. ఈ 7 లక్షల మంది తరఫున సమస్త అవివాహిత పురుష సమాజం.. ఒక ప్రకటన చేసింది. అయితే గత ఏడాది హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్.. ఆ రాష్ట్రంలో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని స్త్రీ, పురుషులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హులైన వారికి నెలకు రూ.2750 పెన్షన్‌గా అందిస్తున్నారు.

మనోహర్ లాల్ ఖట్టర్ తీసుకువచ్చిన పెన్షన్ పథకం సరిగ్గా అమలు కావడం లేదని సమస్త అవివాహిత పురుష సమాజం.. ఆరోపించింది. అంతేకాకుండా ఒకరిద్దరికి తప్ప తమలో అన్నివిధాలుగా అర్హులైన చాలా మందికి ఈ పెన్షన్ అందడం లేదని పేర్కొంది. అందుకే ఎన్నికల వేళ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చినట్లు వెల్లడించింది.