Tuesday, October 1, 2024
HomeUncategorizedపదవ తరగతిలో 625/625 మార్కులు

పదవ తరగతిలో 625/625 మార్కులు

Date:

కర్ణాటక పదో తరగతి ఫలితాల్లో ఒక అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించింది. బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు. తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి. ముధోల్‌ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న బాలిక.. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్రమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.

ఈసందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ఈ విజయం అంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనన్నారు. ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారన్నారు. ఐఏఎస్‌ అధికారిగా దేశానికి సేవ చేయాలని కోరుకొంటున్నట్లు అంకిత తెలిపారు. ఫలితాల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన బాలికకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బాలాకోట్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎం జానకి, జిల్లా పంచాయత్‌ సీఈవో శశిధర్‌ అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆమె కుటుంబాన్ని త్వరలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.