దేశంలోనే వృద్ధ ఎంపీగా పేరుగాంచిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు షఫికర్ రహ్మాన్ బర్క్(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొర్దాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పతరిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పార్లమెంట్లో అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్న రహ్మాన్.. యూపీలోని సంభల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యూపీలోని సంభల్లో జులై 11, 1930న షఫికర్ రహ్మాన్ బర్క్ జన్మించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం సంభల్ నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు మొర్దాబాద్ ఎంపీగాను మూడు సార్లు పని చేశారు. సంభల్ నుంచి రెండుసార్లు గెలుపొందారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే షఫికర్ను బరిలో దించాలని సమాజ్వాదీ పార్టీ ఇటీవలే నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేత మృతి పట్ల సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంతాపం తెలిపారు. ఎంపీ షఫికర్ రహ్మాన్ బర్క్ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వందే మాతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చిన ఘటనలో కేసు కూడా నమోదైంది. ఆఫ్గాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు.