Monday, September 23, 2024
HomeUncategorizedతెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

Date:

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.

మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.