Thursday, September 26, 2024
HomeUncategorizedతెలంగాణలో ఏ రైతును చుసినా కన్నీళ్లే

తెలంగాణలో ఏ రైతును చుసినా కన్నీళ్లే

Date:

తెలంగాణలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు రైతుల కళ్లల్లో ఆవేదన.. కన్నీళ్లు చూశామని తెలిపారు. సత్తమ్మ అనే మహిళ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని.. పైగా నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పు అయినట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అయితే ఒక్క గుంట కూడా ఎండ లేదని గుర్తుచేశారు. ఇప్పుడు కనీసం పట్టించుకునే నాథుడే లేడని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వైపు రైతు బంధు రాకపోవడం, కరెంట్ సరిగ్గా లేక మోటార్లు కాలిపోతుంటే కూడా పట్టించుకుని నాథుడే లేరన్నారు. ఇంకోవైపు వడగండ్ల వానతో తీవ్రమైన పంట నష్టం జరిగిందని తెలిపారు. దాదాపు 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగినట్టు తెలుస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికి, పరిశీలన చేయడానికి కూడా ముఖ్యమంత్రికి, మంత్రులు సమయమే లేదా? అని ప్రశ్నించారు. జిల్లా అధికారులనైనా పంపించి పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. పైగా మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు బ్యాంకర్ల వేధింపులు కూడా ఎక్కువయ్యాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు బ్యాంకులు నోటీసులు పంపి లోన్ కడతారా? లేదా? అని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తామని.. అది కూడా డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

ఏ ఒక్క హామీపై కూడా కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇక ఆరు గ్యారంటీలపై కూడా ప్రజలకు నమ్మకం లేదన్నారు. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు అడుగుతారని నిలదీశారు. ముఖ్యమంత్రికి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడానికి.. వాళ్ల ఇళ్లకు వెళ్లడానికి సమయం ఉందని కానీ.. రైతుల సమస్యలను పట్టించుకోవడానికి లేదా? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలోని లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడి చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.