Monday, September 23, 2024
HomeUncategorizedగులాబీ దళాన్ని వీడుతున్న నేతలు

గులాబీ దళాన్ని వీడుతున్న నేతలు

Date:

ఇంకొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు గులాబీ దళాన్ని వీడి..పక్క పార్టీల్లో చేరారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా బీజేపీలో చేరబోతున్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖను పంపించారు. జహీరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని తన లేఖలో పేర్కొన్నారు బీబీ పాటిల్. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీబీ పాటిల్.. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్‌పై గెలిచారు. 2019న మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి.. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై 6166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐతే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. ఇప్పుడు ఎంపీలంతా ఆ పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు రాజీనామా చేశారు. వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. రాములు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.