పశ్చిమబెంగాల్ సందేశ్ఖాలీలో మొదలైన తుపాను అక్కడే ఆగిపోదని, రాష్ట్రం నలుమూలలకు చేరుతుందని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ ప్రాంతంలో నారీశక్తి వందన్ అభినందన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కొద్దిరోజులుగా బెంగాల్లో సందేశ్ఖాలీ ప్రాంతం వార్తల్లో నిలుస్తోంది. సస్పెన్షన్ ఎదుర్కొంటోన్న టీఎంసీ నేత షాజహాన్ షేక్ స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వనిపక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ అకృత్యాలపై అక్కడి మహిళలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని రక్షించడానికి బెంగాల్ ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు.
ఈసారి ఎన్డీయే 400 స్థానాలు గెలుచుకుంటుంది. ఇండియా కూటమిలో ఇప్పటికే వణుకు మొదలైంది. అందుకే నన్ను నిందించడం మొదలుపెట్టారు. నాకు కుటుంబం లేకపోవడంతో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. ఈ దేశమే నా కుటుంబమని వారు తెలుసుకోవాలి. ఈ సోదరీమణులంతా నా కుటుంబమే. నాకు ఏదైనా సమస్య వస్తే.. ఈ మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు ఓ కవచంలా నిలుస్తారు. సందేశ్ఖాలీలో అకృత్యాలు సిగ్గుచేటు. కానీ వాటిని టీఎంసీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం మీ మీద కంటే.. తన నేతలపైనే నమ్మకం ఉంచింది. ఈ మాఫియాపై పోరాడేందుకు బెంగాల్ మహిళలు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం సందేశ్ఖాలీ తుపానును ఎదుర్కోనుంది” అని వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీ పార్టీ మహిళలను రక్షించలేదు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు ఉరిశిక్ష విధించాలని భాజపా నిర్ణయించింది. మహిళలు ఫిర్యాదు చేసేందుకు మేము ‘విమెన్ హెల్ప్లైన్’ను ఏర్పాటుచేశాం. మమతా బెనర్జీ ప్రభుత్వం వల్ల బెంగాల్లో అది పనిచేయడం లేదు” అని విమర్శించారు. మోడీ సభ నేపథ్యంలో సందేశ్ఖాలీ ప్రాంతానికి చెందిన మహిళలు బస్సుల్లో బయల్దేరారు. అయితే పోలీసులు వాటిని మధ్యలోనే అడ్డుకున్నారు. భద్రతాపరమైన కారణాలతో వాటిని నిలిపివేసినట్లు వెల్లడించారు. భాజపానే ఆ బస్సులను ఏర్పాటుచేసింది. తమను కావాలనే అడ్డుకున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. బరాసత్, సందేశ్ఖాలీ.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప్రాంతాలే.