ఆస్తి కోసం కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ(50), భారతి (45) దంపతులు అంబేద్కర్ నగర్లో నివాసముంటున్నారు.
రెండు ఫ్లాట్ల విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య భారతి మూడు రోజుల క్రితం అతడిని పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేశారు. కాగా, 3 రోజుల నుంచి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు బాధితుడు బోరున ఏడ్చాడు.