Monday, September 23, 2024
Homeసినిమామ‌నదేశం నుంచి ఆస్కార్‌కు 'లాపతా లేడీస్‌'

మ‌నదేశం నుంచి ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్‌’

Date:

దేశ‌వ్యాప్తంగా మంచి పేరు సాధించిన ‘లాపతా లేడీస్‌’ అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మన దేశం తరఫున ఈ సినిమా ఆస్కార్‌కు కచ్చితంగా ఎంపికవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ‘2025లో ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ తరఫున అధికారిక ప్రవేశానికి ‘లాపతా లేడీస్‌’ అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకముంది. ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా యూనిట్‌ అందరి కోరిక’ అని కిరణ్‌రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

2001 కాలపు చిత్రకథ ఇది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ‘లాపతా లేడీస్‌’ని తెరకెక్కించారు. ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నిర్మించారు. ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో గతేడాది ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా.. అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోని సి- బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)’ అవార్డుల్లోనూ లాపతా లేడీస్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో బెస్ట్‌ ఫిల్మ్‌గా నిలిచింది.