దేశంలో జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు చట్టాలు భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) స్థానంలో అమలుచేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ మూడు చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టినట్లుగా ఆయన తెలిపారు.
వీటిపై బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ), జ్యుడీషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని నేర న్యాయవ్యవస్థకు ఈ మూడు చట్టాలు కీలకమైనవని మంత్రి వ్యాఖ్యానించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు కొత్త చట్టాలను గత ఏడాది పార్లమెంటు ఆమోదించగా 2023 డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత వేర్పాటువాద చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశద్రోహం వంటి నేరాలకు విధించే శిక్షల గురించి తెలుపుతుంది.