Tuesday, October 1, 2024
Homeక్రైంఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు షాక్

ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు షాక్

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుల్లో వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. న్యాయస్థానం మే 2న తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందన్నారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగగా.. తీర్పును మే 2 (గురువారం)కు రిజర్వ్ చేసింది. ఆ రోజు విచారణ సందర్భంగా మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్లపై ఆమె తరఫు లాయర్లతో పాటు ఈడీ, సీబీఐ తరఫున లాయర్లు సైతం వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని.. ఈడీ కస్టడీలో ఉండగానే సీబీఐ ఆమెను అరెస్ట్ చేసిందని కోర్టుకు ఆమె తరఫున న్యాయవాది సింఘ్వి వాదించారు. ఆమె పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్ అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఈ కేసులో ఆమె కీలక సూత్రధారి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.