ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పినట్లు కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసహనంతోనే ఆ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ రాజకీయాలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్ను తొలగిస్తుందని రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను మా పార్టీ ఎప్పటికీ తొలగించదు. అలాగే ఎవరినీ అనుమతించదు. ఇది మోదీ గ్యారెంటీ. మోదీ రిజర్వేషన్కి మద్దతుదారు. తమకు రెండు దఫాలుగా పూర్తిగా మెజారిటీ దక్కింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.