Tuesday, September 24, 2024
HomeUncategorizedజవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధం

జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధం

Date:

భారత్‌పై ఏవైపు నుంచి దాడి చేసినా పదునైన జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా దీటుగా స్పందిస్తుందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన ‘డిఫెన్స్‌ సమ్మిట్‌’లో మాట్లాడిన ఆయన.. శాంతి సమయంలోనూ యుద్ధానికి సంసిద్ధతతో ఉండాలన్నారు. చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటోన్న వేళ రక్షణమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘భూ, గగనతల, సముద్ర మార్గం.. ఇలా ఏవైపు నుంచి భారత్‌పై దాడి చేసినా మన దళాలు సరైన విధంగా స్పందిస్తాయి. మనం ఎవ్వరి భూభాగాన్ని ఆక్రమించలేదు. కానీ, ఎవరైనా మనపై దాడి చేస్తే దీటుగా సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నాం. భారత్‌పై ఎవరైనా కన్నెర్ర చేసి.. తప్పించుకునే పరిస్థితి లేదు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గల్వాన్‌లో చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో భారత సైన్యం చూపించిన తెగువను ప్రస్తావించిన ఆయన.. మనది ప్రస్తుతం బలహీన దేశం కాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యత పెంచామని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆత్మనిర్భరతను ప్రోత్సహించామని, భారత్‌లో తయారీతోపాటు సైన్యం ఆధునికీకరణపై దృష్టి పెట్టామన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను తీసుకొచ్చామని అన్నారు.