తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. గ్రూప్- 1 గ్రూప్-2, గ్రూప్- 3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ -1 నోటిఫికేషన్కు సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది.
మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇకపోతే, 1,388 గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్- 1 ఉద్యోగాలకు మార్చి 14వరకు దరఖాస్తులు స్వీకరణ కొనసాగనుండగా.. గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది, గ్రూప్ 3 పోస్టులకు సైతం 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.