తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రత్యేక డ్రైవ్ను మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ శాఖ చేపట్టనుంది. మండలాల్లోనే అధికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ధరణి పోర్టల్లో సవరింపు కోసం 2,45,037 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పట్టాదారు పాస్పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు ఉన్నాయి. 17 రకాల మాడ్యూల్స్ సవరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2.45 లక్షలుగా ఉంది. రికార్డుల అప్డేషన్ పేరుతో నిషేధిత జాబితా పార్ట్-బిలో 13 లక్షల ఎకరాలున్నాయి. కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిష్కరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.