ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు, బ్రిటన్ దేశానికి ప్రథమ మహిళ అక్షత సాదాసీదాగా ఉంటుంది. తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనిపించింది. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తి, ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి నగరంలోని రాఘవేంద్ర మఠాన్ని సందర్శించారు. ఆ టైంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ మొత్తం కలియతిరిగారు. వీరిని చూసిన కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు.
‘యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి, పిల్లలు బెంగళూరులోని రాఘవేంద్ర మఠం వద్ద కనిపించారు. ఎటువంటి సెక్యురిటీ లేకుండా ఉన్నారు. ఇది వారి సింప్లిసిటీకి నిదర్శనం’ అని పేర్కొన్నారు. వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ నారాయణమూర్తి ఫ్యామిలీ ఇలా ఎంతో సింపుల్గా రోడ్లపై తిరుగుతూ కనిపించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షత మూర్తి ఇటీవలే తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులో ఐస్క్రీమ్ పార్లల్కు వెళ్లిన విషయం తెలిసిందే. కార్నర్ హౌజ్ హోటల్లో ఇద్దరూ ఐస్క్రీమ్ తిన్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరూ.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.