Thursday, September 19, 2024
HomeUncategorizedట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

Date:

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 9న ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో జరిగిన జూనియర్‌ వైద్యురాలి హత్యాచారం కేసుపై సీజేఐ డీవే చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. శవపరీక్ష కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులు కూడా పంపారా? అని ఒక న్యాయవాది ప్రశ్నించారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం అవసరమైన కీలక పత్రం గురించి సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆరా తీశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహంతో పాటు ఏమి పంపారో అన్నది సంబంధిత చలాన్‌లోని కాలమ్‌లో కానిస్టేబుల్‌ పూరించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ పత్రం లేకుండా శవపరీక్ష నిర్వహించలేరని బెంగాల్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ఉద్దేశించి అన్నారు.

ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికలో ఈ చలాన్‌ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు. ఒకవేళ అది మిస్‌ అయితే అలా ఎందుకు జరిగిందో అన్నది రేపటి కల్లా వివరణ ఇవ్వాలని కపిల్‌ సిబల్‌కు సూచించారు. ఆ చలాన్‌ను కోర్టుకు సమర్పిస్తామని, అయితే కొంత సమయం కావాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. మరోవైపు బాధితురాలి మరణం, ఎఫ్‌ఐఆర్ నమోదు మధ్య 14 గంటలు ఆలస్యం జరిగినట్లు కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను సెప్టెంబర్ 17లోగా సమర్పించాలని సీబీఐకి ధర్మాసనం సూచించింది. అలాగే బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.