Friday, September 20, 2024
HomeUncategorized80 ఏళ్లుగా ఉంటున్న ఇల్లు కూల్చివేత

80 ఏళ్లుగా ఉంటున్న ఇల్లు కూల్చివేత

Date:

హైడ్రా పేరు వింటేనే ఇప్పుడు హైదరాబాద్ వణికిపోతుంది. అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపిస్తోంది. సోమవారం (ఆగస్టు 26) రాయదుర్గంలో ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అది తమ తాతల కాలం నాటి ఆస్తి అని, 80 ఏళ్లుగా తాను ఆ ఇంట్లో ఉంటున్నానని బాధితుడు చెబుతున్నాడు. చిన్నపిల్లలను, ఆడవాళ్లను బయటకి పంపించి.. సామాన్లన్నింటిని బయటపడేసి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బుల్డోజర్లతో తన ఇంటిని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

హైకోర్టులో తాము వేసిన రిట్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉందని.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా లెక్కచేయకుండా ఇంటిని కూల్చివేశారని బాధితుడు చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని ఆ స్థలంలో తన ముత్తాత 1943లో ఒక ఫ్యాక్టరీని నిర్వహించాడని ఆయన తెలిపాడు. ‘రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇలాంటి కూల్చివేతలు ఆపించండి’ అని బాధితుడు కోరుతున్నాడు.

ఈ ఘటనతో.. చెరువులు, ప్రభుత్వ స్థలాల సమీపంలో ఇళ్లు నిర్మించుకొని, 40 – 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిలో వణుకు పుడుతోంది. ఒక్క హైదరాబాద్ నగరం మాత్రమే కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో 70-80 శాతం విస్తీర్ణం ఒకప్పుడు అడవులు, చెరువులకు సంబంధించిన భూమేనని అందరికీ తెలుసు. వాటన్నింటినీ కూల్చివేస్తారా? ఈ పరిమితులను ఎవరు? ఎప్పుడు? నిర్ణయిస్తారు’ అని ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు.

రేపు ఒకవేళ ఆ నిర్మాణం అక్రమం కాదని తీర్పు వస్తే.. ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారు? హైకోర్టు కంటేనూ హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉన్నతమైందా? హైడ్రా ఎన్నేళ్ల వరకు ఉంటుంది? ఇంకో 50 ఏళ్లు, 100 ఏళ్ల ఇదే విధానాన్ని అమలు చేస్తారా? 80 ఏళ్ల కిందట నిర్మించిన ఇంట్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి వారసులు ఏం పాపం చేశారు?’ అంటూ నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.