Thursday, October 3, 2024
HomeUncategorized64.20 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

64.20 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

Date:

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్‌, మహిళా ఓటర్లకు సెల్యూట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈసీ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారని తెలిపారు. 31.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలను 68,763 బృందాలు పర్యవేక్షించాయని.. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించామని తెలిపారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీపోలింగ్‌ అవసరం రాలేదని చెప్పారు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కి తగ్గిందన్నారు. అందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల పోలింగ్‌ జరిగిందని తెలిపారు.

గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైందని సీఈసీ తెలిపారు. అక్కడ 58.58 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇక ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడించారు. రూ.10వేల కోట్ల నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు.