జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. డిసెంబర్లో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వైరస్ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత కొరవడింది. వీరిలో చాలామందికి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజీని మరొకరు వాడటం వల్లే ఈ వైరస్ వ్యాపించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, ఈ జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని అంటున్నారు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ జిల్లా కారాగారంలో కలకలం రేగింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లఖ్నవూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో ఇక్కడి మిగతా ఖైదీల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య పెరగకుండా వైద్యారోగ్యశాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.