Thursday, October 3, 2024
HomeUncategorized39ఏళ్లలో తొలిసారి ఓడిపోయిన సీఏం

39ఏళ్లలో తొలిసారి ఓడిపోయిన సీఏం

Date:

2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు సిక్కిం రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ పార్టీ ప్రస్తుతం 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోవడం గమనార్హం. పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని మూటగట్టుకున్నారు. 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆయన తొలిసారి పరాజయం పాలయ్యారు.

1994- 2019 వరకు అయిదుసార్లు సీఎంగా పనిచేసిన పవన్‌ చామ్లింగ్‌.. ఈ ఎన్నికల్లో పాక్లోక్‌ కామ్రాంగ్‌, నామ్చేబంగ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. అయితే, పాక్లోక్‌ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్‌ రాయ్‌ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లోనూ అదే పార్టీకి చెందిన రాజుబసంత్‌ చేతిలో 2256 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగు పెట్టకపోవడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా’ ప్రభంజనం సృష్టించి ఏకంగా 31 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019లో ‘ఎస్‌కేఎం’కు 17 సీట్లు రాగా.. ఈసారి మరో 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.