దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’ లో పాల్గొన్న ఆయన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నట్లు చెప్పారు. 2028 నాటికి ముంబై – అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. జపాన్ షింకన్సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ మొత్తం కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు.