Monday, October 7, 2024
HomeUncategorized2000ఉద్యోగాలకు 25వేల నిరుద్యోగులు హాజరు

2000ఉద్యోగాలకు 25వేల నిరుద్యోగులు హాజరు

Date:

దేశంలో నిరుద్యోగ తీవ్రత పెరుగుతూ ఉంది. ముంబయి ఎయిర్‌పోర్టులో నిర్వహించిన ఎయిర్‌ ఇండియా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు నిరుద్యోగులు వేలాది మంది తరలివచ్చారు. 2,216 ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబయి ఎయిర్‌పోర్టులో మంగళవారం ఎయిర్‌ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. దీనికి నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. కౌంటర్ల వద్ద తమ పత్రాలు సమర్పించేందుకు వారంతా ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. ఆహారం, నీరు అందక పలువురు ఇబ్బంది పడ్డారు. కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

ఆ ఉద్యోగంలో చేరినవారు విమానం నుంచి లగేజీ దించడం, ఎక్కించడంతోపాటు బ్యాగేజీ బెల్టులను చూసుకోవాలి. ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌లో లగేజీ, కార్గోను చూసుకునేందుకు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. వారికి నెలకు రూ.20వేల నుంచి 25 వేలకు వేతనం అందిస్తారు. ఓవర్‌టైమ్ చేసి చాలామంది రూ.30వేల వరకు సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హతలు ఉంటే సరిపోతుంది కానీ, అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కొందరు 400 కి.మీ. ప్రయాణించి రావడం గమనార్హం. వారిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిగ్రీ పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా ఇప్పటివరకు ఉద్యోగం లభించనివారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కోసం వచ్చారు. మరికొందరు రాజస్థాన్‌ నుంచి వచ్చినవారు ఉన్నారు. ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో కొద్దిరోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్వ్యూకు వచ్చిన ఉద్యోగార్థుల రద్దీ ఎక్కువై ఒకరినొకరు తోసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.