ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని, ఇందుకు ఫారం-డీ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఆర్వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని వివరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్, హోమ్ ఓటింగ్ను వినియోగించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ ఉంటుందని సీఈవో వెల్లడించారు. లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని అంశాలు..
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.30 కోట్ల మంది, 85 ఏళ్లు దాటిన వారు 1.94 లక్షల మంది, దివ్యాంగులు, 85 ఏళ్ల వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం, సరిహద్దుల వద్ద 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ లేదా 1950 ద్వారా ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ప్రచారంలో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయకూడదు. రోడ్షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడకూడదు. ఆర్వో, డీఈవో, పోలీసు అధికారులకు ఢిల్లీలో శిక్షణ ఇచ్చాం. మరికొంత మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోసం 1,85,612 మంది పోలీసు సిబ్బంది నియామకం. 35,365 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కోసం 54,353 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం 500 బీయూలు, 500 వీవీ ప్యాట్లు ఉపయోగిస్తున్నాం.