మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ సిటీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా ప్రయాణికు ల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టిపెట్టింది. దీంతో.. గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొత్త ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీలో మహిళా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్ బస్సులు, 25 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నట్లు, వీటిని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరో ఆరు నెలల్లో గ్రేటర్లో దశలవారీగా 450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు.
గ్రేటర్ జోన్లో ఆర్టీసీ ప్రస్తుతం 2,900 బస్సులు నడుపుతూ రోజూ 20 లక్షల మందికి సేవలందిస్తోంది. 2024 డిసెంబర్ నాటికి గ్రేటర్ జోన్లో బస్సుల సంఖ్య 3,500కు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జూన్లో వచ్చే 125 మెట్రో డీలక్స్ బస్సుల్లో 2/2 సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. బస్సుల సంఖ్య పెరిగితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షలకు చేరే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. శివారు ప్రాంతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ ఆర్టీసీ బస్సుల రూట్ మ్యాప్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.