Thursday, October 3, 2024
HomeUncategorizedహిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ నలుగురు మృతి

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ నలుగురు మృతి

Date:

కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు మరణించగా మరో 18 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు స్థానిక గైడ్‌లు ఉన్నట్లు తెలుస్తుంది.

హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ ‘మనేరి’ ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న ట్రెక్కింగ్‌ పాయింట్‌కు చేరుకుందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ తెలిపారు. జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సిఉందని, కానీ చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్‌కు చేరుకునేసరికి వాతావరణం సరిగా లేకపోవడంతో వారు దారి తప్పారని బిష్త్ చెప్పారు. అనంతరం బృందంలోని నలుగురు సభ్యులు మరణించారని, ఇతరులు చిక్కుకుపోయారని ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్ధారించింది. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. అటవీ శాఖకు చెందిన 10 మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయలుదేరాయని పేర్కొన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశామని, 14మంది రక్షణ సిబ్బంది, ఒక వైద్యుడిని ఘటనా స్థలానికి పంపామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్‌, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.