Saturday, October 5, 2024
HomeUncategorizedస్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయని ఏడుగురు ఎంపీలు

స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయని ఏడుగురు ఎంపీలు

Date:

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్‌గా నెగ్గినట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. దాంతో ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్‌ ఓడిపోయినట్లయ్యింది.

స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలకు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఆ ఏడుగురు ఇంకా లోక్‌సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయలేదు. తొలి రెండు రోజుల్లో ప్రొటెం స్పీకర్‌ మొత్తం 235 మంది సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మరో ఏడుగురు మిగిలిపోయారు. బుధవారం మిగతా ఏడుగురి ప్రమాణస్వీకారాలు పూర్తికాకుండానే స్పీకర్‌ ఎన్నిక నిర్వహించారు. దాంతో ఆ ఏడుగురు ఎంపీలకు స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఈ అవకాశం దక్కని ఎంపీల్లో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, మరొకరు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శత్రుఘ్ను సిన్హా. వీరితోపాటు తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకే చెందిన దీపక్‌ అధికారి, నురుల్‌ ఇస్లామ్‌, సమాజ్‌వాది పార్టీకి చెందిన అఫ్జల్‌ అన్సారీ (ముఖ్తార్‌ అన్సారీ సోదరుడు), మరో ఇద్దరు ఇండిపెండెంట్‌లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు.