Tuesday, September 24, 2024
HomeUncategorizedసీఏఏ పోర్టల్ ప్రారంభించిన కేంద్రం..

సీఏఏ పోర్టల్ ప్రారంభించిన కేంద్రం..

Date:

దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఏఏపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఏఏ అమలుకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేదానిపై స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ సీఏఏను కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది.

సీఏఏ కింద పౌరసత్వం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కొత్త వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. https:/indiancitizenshiponline.nic.in వెబ్‌ పోర్టల్‌ను ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం.. త్వరలోనే CAA-2019 అనే మొబైల్‌ యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. ఆ శరణార్థుల వద్ద సరైన ధ్రువపత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం ఇచ్చేలా చట్టం చేసింది. 2014 డిసెంబరు 31 వ తేదీ కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ చట్టం వర్తిస్తుందని కేంద్రం ఆ చట్టంలో స్పష్టం చేసింది. అయితే ఇందులో ముస్లింలకు అవకాశం కల్పించకపోవడం తీవ్ర వివాదానికి కారణం అయింది.

భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకునే శరణార్థులు కేంద్రం తీసుకువచ్చిన https:/indiancitizenshiponline.nic.in వెబ్‌పోర్టల్‌కు వెళ్లాలి. అందులో సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తుల సమర్పణ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ మొబైల్‌ నంబర్, కోడ్‌ను ఎంటర్‌ చేస్తే తర్వాతి వెబ్‌పేజ్ ఓపెన్‌ అవుతుంది. అక్కడ పేరు, ఈ-మెయిల్‌ ఐడీ సహా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేసి.. ఒకసారి ఆ వివరాలన్నింటినీ సరి చూసుకున్న తర్వాత సబ్మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఈ-మెయిల్‌, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్‌ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌ పూర్తైన తర్వాత ఎవరైతే పౌరసత్వం కోసం అమలు చేస్తున్నారో వారి పేరుతో లాగిన్‌ కావాలి. ఆ తర్వాత కొత్త దరఖాస్తు బటన్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ వారి వ్యక్తిగత వివరాలు, ఏ దేశానికి చెందిన వారు.. భారత్‌కు ఎప్పుడు వచ్చారు.. ఎన్ని ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు అనే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు నింపి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు జారీ చేసిన పాస్‌పోర్ట్‌, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలను ఈ వెబ్‌పోర్టల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు 2014 డిసెంబరు 31 వ తేదీ కంటే ముందే భారత్‌లోకి వచ్చినట్లు నిరూపించే పత్రాలను సమర్పించాలి. అంటే భారతదేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌, భారత్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డు, ఇక ఇక్కడే జన్మించిన వారు ఎవరైనా ఉంటే వారి జనన ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్డ్‌ రెంటల్‌ అగ్రిమెంట్‌, పాన్‌ కార్డు, విద్యుత్‌ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్‌, ఈఎస్ఐ, మ్యారేజీ సర్టిఫికేట్‌ ఇలా ఏదైనా గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.