Friday, September 20, 2024
HomeUncategorizedశివాజీ విగ్ర‌హం కూలిన ఘ‌ట‌న‌లో శిల్పి అరెస్ట్‌

శివాజీ విగ్ర‌హం కూలిన ఘ‌ట‌న‌లో శిల్పి అరెస్ట్‌

Date:

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహన్ని త‌యారు చేసిన‌ శిల్పి జైదీప్‌ ఆప్టేని పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో తనని అరెస్ట్‌ చేస్తారనే భయంతో జయదీప్‌ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే కల్యాణ్‌లోని అతని ఇంటి బయట అదుపులోకి తీసుకున్నారు. కుటుంబాన్ని కలిసేందుకు వస్తున్నాడని ఆప్టే భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు.

కల్యాణ్‌ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్‌ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. విగ్రహం కూలిన ఘటనలో ఆప్టేపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అయితే పది నెలలు గడువక మేందే గత నెల కుప్పకూలిన విషయం తెలిసిందే. విగ్రహ ఏర్పాటులో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శివాజీ విగ్రహం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు తీసుకున్నప్పటికీ.. రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చే చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాగా, విగ్రహం కూలిన ఘటనపై పెనుదుమారం చెలరేగడంతో ప్రధాని మోదీ ప్రజలకు క్షమాణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.