Saturday, September 21, 2024
HomeUncategorizedవిశ్వవేదికపై దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది

విశ్వవేదికపై దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది

Date:

దేశంలో ఎన్ని సమస్యలొచ్చినా అభివృద్ధి మాత్రం ఆపలేదని, గత ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురైనా దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయామన్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నో తరాలు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయాలను ప్రస్తుత లోక్‌సభ కాలంలో తీసుకున్నామని చెప్పారు. ‘ఆర్టికల్ 370’ రద్దును ఈ సందర్భంగా ఉటంకించారు. సభలో ‘రామ మందిరం’పై తీర్మానం.. భవిష్యత్తు తరాలకు దేశ విలువలపై గర్వపడేలా రాజ్యాంగపరమైన స్థైర్యాన్ని ఇస్తుందన్నారు.

తమ పాలనలో రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను నిత్యం స్మరించుకుంటున్నామని, వాటి దిశగా తమ పాలన కొనసాగుతోందన్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారతామని.. ‘వికసిత్‌ భారత్‌’ ఫలాలు మన భావితరాలకు అందుతాయని తెలిపారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, దీంతో విశ్వవేదికపై దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని వివరించారు. కొత్త పార్లమెంటు భవనం మనందరికీ గర్వకారణమన్నారు. డిజిటలైజేషన్‌తో కాగితరహిత పార్లమెంటుగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.