దేశంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేసారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మాయావతి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో, బలంతో ఎన్నికల్లో పోరాడుతోందని మాయావతి స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కూటమి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పుకార్లపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదని.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బహుజనుల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీఎస్పీ దృఢ నిర్ణయం తీసుకుందన్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి ప్రకటించారు. కూటముల్లో చేరేందుకు నిరాకరించారు. ఎన్నికల కోసం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, ఆమె ఇండియా కూటమిలో చేరనున్నారనే ఊహాగానాలున్నాయి.