దేశంలో జరిగిన నీట్ యూజీ 2024 పరీక్ష లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున.. ‘నీట్ రీటెస్ట్’ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ”నీట్ ప్రశ్నపత్రం లీకైంది అన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది” అని ధర్మాసనం తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్రానికి న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. ”పేపర్ లీక్తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. కానీ, అది 23లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం. అందువల్ల, లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసుకున్నారా?లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు?ఎంతమంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్లో ఉంచారు?వీటికి సమాధానాలు కావాలి. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి” అని ధర్మాసనం ఆదేశించింది. అన్నీ పరిశీలించిన తర్వాత దీనిపై తీర్పు చెబుతామని వెల్లడించింది. నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో తెలుపుతూ తమకు నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం తొలిసారి ఎప్పుడు లీకైందన్న విషయాన్ని వెల్లడించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది.