దేశంలోని రైతులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదని, రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఈరోజు 10 కోట్ల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి అందుకుంటున్నారని అన్నారు. రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడం కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు.
పశు సంపదనూ తమ ప్రభుత్వం పరిరక్షిస్తూ జంతుజాలానికి ఉచిత వ్యాక్సినేషన్ కల్పిస్తున్నామన్నారు. రాజస్ధాన్లో గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ 2024 ఎన్నికలు వికసిత్ భారత్ ప్రచారానికి ఊతమిస్తాయని అన్నారు. కాంగ్రెస్ వదిలేసిన ఎన్నో సమస్యలను తాము గత పదేండ్లలో చక్కదిద్దామని వివరించారు. దశాబ్ధాలుగా గరీబీ హఠావో నినాదాన్ని కాంగ్రెస్ వల్లెవేసిందని, అయితే మోదీ మాత్రం 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేశారని అన్నారు. కాంగ్రెస్ అహంకారంతో దళితులు, గిరిజనులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా పేదల బిడ్డ ప్రధాన సేవకుడిగా మారిన తర్వాత పేదలు పలు సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారని అన్నారు.