రైతులు న్యాయపరమైన తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ బయలుదేరారు. రైతులకు కావాలని సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఉండిపోమని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానిది ఒక్కో సమస్య. ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు. మేం వారికి దూరంగా లేము. అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని టికాయత్ మీడియాతో మాట్లాడారు.
గతంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020-21లో అన్నదాతలు చేపట్టిన నిరసనలో రాకేశ్ కీలకపాత్ర పోషించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో తాజాగా ‘ఢిల్లీ చలో’ పేరిట భారీ మార్చ్ తలపెట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. అయితే పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆ ఉద్రిక్తతల నేపథ్యంలోనే టికాయత్ వార్నింగ్ వచ్చింది. ఇదిలాఉండగా.. రైతుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయత్ కోరారు. భారతీయ కిసాన్ యూనియన్.. ఉత్తర్ప్రదేశ్ కేంద్రంగా నడుస్తోన్న రైతుసంఘం. దీని వ్యవస్థాపకుల్లో మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ కూడా ఒకరు. ఆయనకు ఇటీవల కేంద్రం ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.