Monday, October 7, 2024
HomeUncategorizedరైతును అవ‌మానించిన మాల్‌పై చ‌ర్య‌లు

రైతును అవ‌మానించిన మాల్‌పై చ‌ర్య‌లు

Date:

ఒక రైతు పంచెక‌ట్టుతో బెంగళూరులోని ఓ మాల్‌లోకి వెళుతుండ‌గా మాల్ నిర్వాహ‌కులు రానివ్వ‌కుండా అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏడురోజుల పాటు మాల్‌ను మూసివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంగళవారం మాగడి రోడ్డు జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హావేరికి చెందిన ఫకీరప్ప అనే రైతును అక్కడి కాపలాదారు గోపాల్‌ అడ్డుకున్నాడు. పంచె కట్టుకుని వచ్చిన ఆయన్ను లోపలికి అనుమతించలేదు. ఫకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం.. రైతుకు శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది.