Sunday, September 29, 2024
HomeUncategorizedరేపటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ

రేపటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ

Date:

తెలంగాణలో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ఘట్టం రేపు (ఏప్రిల్ 18) ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం ఏడు దశలలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగో దశలో ఎన్నికలు జరపనున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు.. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

గురువారం (ఏప్రిల్ 18) ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారు ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు.. అవి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల అధికారులు ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. ఇక, మే 13న పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే మే 11 సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక, జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడికానున్నాయి.

ముఖ్యమైన తేదీలు..
ఎన్నికల నోటిఫికేషన్ – ఏప్రిల్ 18 (గురువారం)
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- ఏప్రిల్ 25 (గురువారం)
నామినేషన్ల పరిశీలన- ఏప్రిల్ 26 (శుక్రవారం)
నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29 (సోమవారం)
పోలింగ్ తేదీ- మే 13 (సోమవారం)
ఓట్ల లెక్కింపు – జూన్ 4 (మంగళవారం)