Friday, September 20, 2024
HomeUncategorizedరూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం

రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం

Date:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభయ హస్తం హామీలను అమలు చేయడానికి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ఇక తాజాగా ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పటానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా సరే పథకాల అమలుపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. తాజాగా ఇదే క్రమంలో తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.

ఇకపై కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. తులం బంగారం పంపిణీపై అంచనాలు రూపొందించాలని, దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బిసి, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి , కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లపై రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంచనా వ్యవయం ఆధారంగా గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే సర్కార్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అందిస్తుంది. ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు చేసి ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది.