Tuesday, October 8, 2024
HomeUncategorizedయునెస్కో జాబితాలో అహోమ్ స‌మాధులు

యునెస్కో జాబితాలో అహోమ్ స‌మాధులు

Date:

యూనెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ జాబితాలో అస్సాంలో ఉన్న చ‌రాయిడియో మైద‌మ్ స‌మాధి క‌ట్ట‌డాల‌కు అరుదైన గుర్తింపును ఇచ్చారు. క‌ల్చ‌ర‌ల్ ప్రాప‌ర్టీ క్యాట‌గిరీలో ఆ ప్రాంతాన్ని చేర్చారు. ఈజిప్టు పిర‌మిడ్స్ త‌ర‌హాలో.. తూర్పు అస్సాంను పాలించిన అహోమ్ చ‌క్ర‌వ‌ర్త‌లు ఇక్క‌డ త‌మ స‌మాధుల‌ను ఏర్పాటు చేశారు. చ‌రాయిడియో మైద‌మ్‌ను చ‌క్ర‌వ‌ర్త‌లు ఖ‌న‌న ప్ర‌దేశంగా పిలుస్తారు. మైద‌మ్ అంటే పుట్ట త‌ర‌హాలో భూమిపై ఎత్తుగా ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతం యూనెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం ఇదే మొద‌టిసారి. తూర్పు అస్సాం ప్రాంతాన్ని సుమారు 600 ఏళ్ల పాటు అహోమ్ రాజులు పాలించారు. బ్రిటీష‌ర్ల రాక‌కు పూర్వం ఇక్క‌డ ఆ రాజుల పాల‌నే ఉండేంది. పిర‌మిడ్స్ త‌ర‌హాలో ఇక్క‌డ బొంద గ‌డ్డ‌ల‌ను నిర్మించారు.

అహోమ్ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు ద‌క్క‌డం సంతోష‌క‌ర‌మ‌ని, ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. చ‌రాయిడియో మైద‌మ్‌.. అహోమ్ సంస్కృతిని ప్ర‌తిబింబింప చేస్తుంద‌ని, మ‌న పూర్వీకుల‌కు అమిత‌మైన గౌర‌వాన్ని తెలియ‌జేస్తుంద‌ని, అహోమ్ చ‌క్ర‌వ‌ర్తులు, వారి పాల‌న గురించి ప్ర‌జ‌లు మ‌రింత తెలుసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్లు మోదీ త‌న ఎక్స్‌లో తెలిపారు. చ‌రాయిడియో మైద‌మ్ ప్రాంతాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చే నిర్ణ‌యాన్ని భార‌త్‌లో జ‌రిగిన 46వ వ‌ర‌ల్డ్ హెరిటేజ్ క‌మిటీలో తీసుకున్నారు. ఇది అస్సాంకు గొప్ప విజ‌య‌మ‌ని ఆ రాష్ట్ర సీఎం హేమంత బిశ్వ శ‌ర్మ త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌క‌టించారు. ఇంటర్నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్‌.. మొయిద‌మ్ గురించి ప్ర‌తిపాద‌న చేసింది.