Saturday, October 5, 2024
HomeUncategorizedమూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం

మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం

Date:

లోక్‌సభ సభాపతిగా మరోసారి ఓంబిర్లానే గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేశ్‌ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్‌ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు.

స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. అనంతరం ఓంబిర్లాను మోదీ, రాహుల్‌, కిరణ్ రిజుజు సాదరంగా సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. స్పీకర్‌ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్‌ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఇండియా కూటమి తరఫున సీనియర్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగింది.