Tuesday, September 24, 2024
HomeUncategorizedమహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తా

మహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తా

Date:

దేశంలో మహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సశక్త్‌ నారీ-వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని స్త్రీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ సమాజం అయితే మహిళల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందో ఆ సమాజం వృద్ధి చెందుతుందని తాను నమ్ముతానని అన్నారు. తమ ప్రభుత్వం వనితల కోసం అమలుచేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉదహరించారు. కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు రుణాలుగా దాదాపు రూ.8,000 కోట్లను మోడీ పంపిణీ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.8 లక్షల కోట్లకు పైగా నగదును మహిళలకు పంపిణీ చేశామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటివరకు కోటి మంది స్త్రీలు లఖపతి దీదీలుగా మారారని ఆయన చెప్పారు. మహిళలకు చిన్న సహాయం చేసినా వారు తిరిగి ఇతరులకు సహాయం చేస్తారనే విషయం తన అనుభవం ద్వారా తెలుసుకున్నానన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు దీనిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేవి కావని తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో పథకాలను చేపట్టిందని తెలిపారు. మహిళలు గౌరవంగా జీవించడానికి వారికి మరుగుదొడ్లు ఏర్పాటుచేయడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం గురించి అవగాహన కల్పించడం, వంట చెరుకు పొగ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడం వంటి మహిళల సమస్యల గురించి మాట్లాడిన మొదటి ప్రధాని తానే అని మోదీ పేర్కొన్నారు. ఇలా చేసినందుకు కాంగ్రెస్‌ వంటి రాజకీయ పార్టీలు నాడు తనను ఎగతాళి చేశాయని, అవమానించాయని గుర్తు చేసుకున్నారు.