నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై వీధి కుక్కల గుంపు దాడికి దిగిన ఘటన హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది. వాటి దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. చిత్రపురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడిపోయినా కుక్కలను అదిలించే ప్రయత్నం చేసింది.
ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బాధిత మహిళ భర్త ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. ఊర కుక్కలకు ఇంటి బయట అన్నం పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ”ఇంటి ముందు కుక్కలకు అన్నం పెడితే నా భార్యకు ఎదురైన పరిస్థితే మీకు కూడా రావొచ్చు” అంటూ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది.