Friday, September 20, 2024
HomeUncategorizedమహారాష్ట్రలో వర్షాలకు కుప్పకూలిన శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో వర్షాలకు కుప్పకూలిన శివాజీ విగ్రహం

Date:

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 35 అడుగుల విగ్రహం మహారాష్ట్రలో కుప్పకూలింది. రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీ విగ్రహం కుప్పకూలింది. ఘటనా స్థలానికి పోలీసు సిబ్బంది, జిల్లా అధికారులు చేరుకున్నారు. ఈ ఘటనకు సరైన కారణాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. 

*నాణ్యతపై దృష్టి పెట్టలేదు..*

శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాణ్యతా లోపం కారణంగా విగ్రహం కూలిపోయిందంటూ ఆరోపించాయి. ”రాష్ట్ర ప్రభుత్వం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై తప్ప.. నాణ్యతపై దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ నష్టం జరిగింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు వేసి.. దాని ప్రకారం కమీషన్లు ఇస్తోంది” అని ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్‌ పాటిల్‌ ఆరోపించారు.