Monday, September 23, 2024
HomeUncategorizedమళ్లీ అన్నదాతల ఢిల్లీ ఛలో…!

మళ్లీ అన్నదాతల ఢిల్లీ ఛలో…!

Date:

అన్నదాతల డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో మళ్లీ తమ ఢిల్లీ ఛలో మెగా మార్చ్‌ను కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి మళ్లీ దేశ రాజధాని ఢిల్లీకి యాత్ర చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే అటు.. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో అన్నదాతలు తమదైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను సెక్యూరిటీ సిబ్బంది ప్రయోగిస్తుండగా.. వాటికి కౌంటర్‌గా తాము కూడా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న రైతులు.. వాటికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇనుప కవచాలు, జూట్ బ్యాగులతో మలి విడత ఆందోళనలకు సిద్ధం అయ్యారు.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సహా వివిధ రకాల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. వివిధ రాష్ట్రాల్లోని అన్నదాతలు ఈ నెల 13 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీకి మెగా మార్చ్ ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రైతులను.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్దే నిలిపివేసింది. వారిపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో రైతులు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాల నేతలు నిర్వహించిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తిరిగి తమ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించారు.

అయితే పప్పులు, మొక్కజొన్న, పత్తి వంటి మూడు పంటలకు సంబంధించి 5 ఏళ్లు పాత కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో బుధవారం నుంచి ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఈసారి మరింత పకడ్బందీగా యాత్ర చేపట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇనుప షీల్డ్‌లు, జూట్ బస్తాలను సిద్ధం చేసుకున్నారు. పంజాబ్-హర్యానా బోర్డర్‌లోని శంభు సరిహద్దు వద్ద ఈ ఇనుప కవచాలు, జూట్ బ్యాగులను తరలించుకున్నారు. పోలీసులు వదిలే టియర్ గ్యాస్ షెల్స్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.