Thursday, September 19, 2024
HomeUncategorizedభారత విద్యార్థులకు ఫ్రాన్స్‌లో చదువులు

భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌లో చదువులు

Date:

భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఏవిధంగా తోడ్పాటునందించనుందో మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని వివరించారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.

భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో గురువారం జైపుర్‌ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గురువారం జైపుర్‌ శివారులోని ఆమెర్‌ కోటను మెక్రాన్‌ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు హస్తకళల దుకాణంలో అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. నేతలిద్దరూ సాహూ చాయ్‌వాలా వద్ద మసాలా టీ సేవిస్తూ కబుర్లు చెప్పుకొన్నారు. తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.