Thursday, September 19, 2024
HomeUncategorizedభార‌త్‌లో ప్రాణాంత‌క‌ మంకీ పాక్స్ కేసు న‌మోదు

భార‌త్‌లో ప్రాణాంత‌క‌ మంకీ పాక్స్ కేసు న‌మోదు

Date:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌ను వ‌ణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ కేసు భారత్‌లో నమోదైంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్‌ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వెంటనే అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. రోగి నుంచి నమూనా సేకరించి ఎంపాక్స్‌ నిర్ధరణ కోసం పంపించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగుతోందని పేర్కొంది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని.. ఆందోళన చెందాల్సి అవసరం లేదని చెప్పింది. ఇటువంటి కేసులు వెలుగు చూసిన సందర్భంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు ప్రాణాంతక ఎంపాక్స్‌ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకర రీతిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 18వేల అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయి. కొత్తరకం కేసులు ఇప్పటివరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతోపాటు స్వీడన్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లోనూ ఈ ఏడాది మార్చి తర్వాత ఈ కేసులు నమోదు కాలేదు.